20, మార్చి 2013, బుధవారం

ప్రజల కన్నీళ్ళ గురించి చర్చలు పెడితే బాగుంటుంది !

ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాలో జరుగుతున్న చర్చలు ఈ మధ్యన ఎటుపోతున్నాయో అర్థం కావడం లేదు. నాయకుల కన్నీళ్ళ గురించి చర్చలు పెడతారు. రాజకీయ నాయకులు ఒకరినొకరు  వ్యక్తిగతంగా దూషించుకున్న తర్వాత ఫలానా  ఆయన ఫలానా  ఆయన గురించి అలా తిట్టాడు,ఆ తిట్టుకు అతడు అర్హుడేనా , నిజమేనా అని sms లు అడుగుతారు. కోర్టులలో జరుగుతున్న విషయాల మీద ఇక్కడ చర్చలు పెడతారు,వీళ్ళే ఎవరు దోషో ,ఎవరు నిర్దోషో  తేల్చేస్తారు. భార్యా భర్తల మధ్యన వచ్చే చిన్న చిన్న తగాదాలను కూడా ఇక్కడ తీసుకు వచ్చి చర్చకు పెడతారు.  భార్యా భర్తలు మద్యన చిన్న చిన్న సమస్యలు వచ్చి  అభిప్రాయభేదాలు రావచ్చు ,తర్వాత వాళ్ళే కలసి పోయే అవకాశం  ఉంది . కానీ లైవ్ లో వీళ్ళు పెట్టే  చర్చల  లో భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు పై చేయి సాధించుకోవడానికి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు.ఇంకా మానసికంగా దూరమవుతారు . వీళ్ళు చేసే నిర్వాకం వలన కలసి పోయేదానికంటే ,దూరమయ్యే అవకాశమే ఎక్కువ. ఈ చర్చలు చూడాలంటేనే వెగటు పుడుతూ ఉంది . ప్రజల కన్నీళ్ళ గురించి,వాళ్ళ బాధల గురించి మీడియా చర్చలు పెడితే బాగుంటుంది.

16, మార్చి 2013, శనివారం

తమ తాత్కాలిక స్వార్థ ,రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టారు.

తమ తాత్కాలిక స్వార్థ ,రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టి అధికార పక్షానికి భుజం భుజం కలిపి దన్నుగా నిలబడ్డారు.కానీ ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువగా అంచనా వేయరాదు. ప్రజల కోసం కాకుండా తమ స్వార్థాల కోసం పని చేసే రాజకీయ పార్టీ లను తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు  రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఎల్లప్పుడూ సర్వ సన్నద్దులై  ఉంటారు .  

13, మార్చి 2013, బుధవారం

పీఒన్ దచ్చిగిరి చెబితేనే సెలవు!

చిన్నప్పుడు పాఠశాలలో క్లాసు జరుగుతున్నప్పుడు  పీఒన్ (ప్యూన్)దచ్చిగిరి ఏదో ఒక బుక్ పట్టుకొని  సార్  దగ్గరికి వస్తూనే పిల్లలందరికీ  ఒక ఆనందం ,దచ్చిగిరిని చూస్తూనే కృష్ణ పరమాత్మున్ని చూస్తున్నట్లు ఉండేది .ఎందుకంటే  మరసటి రోజున సెలవని సర్కులర్ తెచ్చి ఉంటాడని పిల్లలందరి ఆశ. సారు ఏం  చెబుతారా అని  పిల్లలందరూ ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు. ఒక వేల సెలవని సార్  చెబితే పిల్లలు సంతోషంతో దచ్చిగిరి వైపు కృతజ్ఞతగా   ఒక చూపు చూసేవారు .లేక పొతే అది వేరే విషయం.అప్పుడు కూడా  కాలెండర్లు ఉండేవి ,కానీ సెలవు మాత్రం  దచ్చిగిరి బుక్కు తెచ్చి సారు  నోటి నుండి వింటేనే ,అదొక ఆనందం .        

8, మార్చి 2013, శుక్రవారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .

మహిళలందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు తమ తమ రంగాలలో వివక్ష లేకుండా పైకి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ..మహిళలందరికీ , అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు . 

7, మార్చి 2013, గురువారం

చివరికి పశువులకు కూడా ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది .

నా చిన్నప్పుడు తినే  ఆహారం లో  వైవిధ్యం ఉండేది . కొర్ర,ఆరిక ,జొన్నఅప్పుడప్పుడు వరి  అన్నం తినే వాల్లం . అప్పుడు చాలా బాగుండేది . కానీ నేడు అవన్నీ మాయమైనాయి. ఒక్క వరి అన్నమే ఉంది .మనుషులకే కాదు చివరికి పశువులకు కూడా అప్పటికీ ఇప్పటికీ ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది . పూర్వం గడ్డివామిలో ఒక వరుస  వేరుశనగ కట్టె ,ఒక వరస ఆరిక గడ్డి,ఒక వరస కొర్ర గడ్డి ,ఒక వరస జొన్న చొప్ప,ఒక వరస వరి గడ్డి ,ఒక వరస జొన్న కంకుల గగ్గులు ఉండేవి . ఇవన్నీ  కూడా క్రిమి సంహారక  మందులు ,రసాయనిక ఎరువులు వాడకుండా పండించేవారు . ఇవన్నీ  వేసి ఒక సంవత్సరానికి సరిపడే  గడ్డి వామి వేసే వారు. ఈ గడ్డి ని తీసుకొని వచ్చి  పశువులకు వేస్తే  వాటికి పంచభక్ష్య పరమాన్నం తిన్నట్లు ఉండేది ,అవి ఆవురావురు మని తినేవి. పుష్టిగా ఉండేవి . కానీ నేడు  రైతులు గిట్టుబాటు కాక నో ,లేక మరొక కారణం చేతనో ఆ  పంటలన్నీ మానుకొని  రసాయనిక ఎరువులు ,క్రిమిసంహారక మందులు వాడి  శనగ పంట మాత్రమే పండిస్తున్నారు. మిషన్లతో కొట్టించిన తర్వాత వచ్చిన ఆ శనగ పొట్టును  మాత్రమే ఈ వాళ పశువులకు పెడుతున్నారు.అవి ఆకలికి తాళలేక ఆ పొట్టునే తింటున్నాయి . ఆ నోరు లేని జీవులను చూస్తే  బాధ వేస్తుంది .

3, మార్చి 2013, ఆదివారం

మనుష్యుల కంటే జంతువులను బాగా ప్రేమిస్తున్నారు!

ఈ మధ్యన మనుషుల్లో నాగరికత పెరిగే కొద్దీ మనుష్యుల కంటే జంతువులను బాగా ప్రేమిస్తున్నారు.ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకొని వాటికి ప్రేమను బాగా పంచుతున్నారు. కానీ సాటి మనుషులకు మోసాలు చేసి ,ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు పిసరంత సహాయం చేయడం పక్కన పెట్టి  ,లేనిపోని ఇబ్బందులు సృష్టించుతున్నారు.జంతువులు వీళ్ళ స్థాయి కి ఎదిగాయో ,వీళ్ళు జంతువుల స్థాయి కి ఎదిగారో అర్థం కావడం లేదు!