28, ఏప్రిల్ 2012, శనివారం

కౌగిలింతల భయం పట్టుకున్న తెలుగుదేశం పార్టీ .

ఒక కౌగిలింత తెలుగుదేశం పార్టీ లో వణుకు పుట్టించింది.నిన్న జగన్, వంశీల పరస్పర పలకరింపులు,కౌగలింతలు తెలుగుదేశం పార్టీ వెన్నులో చలి పుట్టించింది , అని అనడానికి  నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రవర్తన చూస్తే     తెలుస్తుంది.ప్రజాస్వామ్యం గురించి  నిత్యం మాట్లాడే తెలుగుదేశం పార్టీ  ,రాజకీయాలలో వేరు వేరు రాజకీయ పార్టీలకు  ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు శత్రువులు లాగా ఉండాలని అనుకుంటుందా? రాజకీయాలు వేరు వ్యక్తిగత పలకరింపులు వేరు కాదా?ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?అంత బలహీన మైన పునాదుల మీద ఉందా తెలుగుదేశం పార్టీ?




ఆర్గానిక్ మోసం

          పూర్వం రైతులు తాము పండించిన విత్తనాలనే మళ్ళీ  విత్తడం కోసం  దాచిపెట్టుకొని తర్వాత సంవత్సరం విత్తుకునేవాళ్ళు.విత్తన శుద్ది కూడా రొచ్చు(పశువుల మూత్రం ) తో చేసుకునేవారు.పంటలకు పశువుల ఎరువును వాడే వారు.
    తర్వాత కాలంలో బహుళ జాతి కంపినీలు తమ లాభాల కోసం మార్కెట్ లో దిగి  ఒకసారి విత్తిన విత్తనాలు తర్వాత పనికి రాకుండా చేసి తప్పని సరిగా ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరే వాళ్ళు చెప్పిన  ధరకు విత్తనాలను కొనేలా చేసినారు.
         రైతులకు  రసాయనిక ఎరువులను దగ్గర చేయడం వలన వాళ్ళు పశువులను  పెంచకుండా పోయినారు.దీనివలన రైతులు తప్పని సరిగా రసాయనిక ఎరువుల మీద ఆధార పడేలా  చేసినారు .పూర్వం రైతులు దేని కోసం ఎవరి మీద ఆధార పడకుండా ఉండేవారు.కానీ ప్రభుత్వాల కున్న బహుళజాతి సంస్థల మీద ప్రేమ వలన రైతులు ఆర్థికంగా దెబ్బతిని పోయినారు.ఇన్ని చేసినా రైతులు పండించిన పంట కు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైనారు.

      కానీ అవే బహుళ జాతి సంస్థలు ఈ మధ్యన "ఆర్గానిక్ ఫుడ్ "అనే   ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని తిరిగి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.అదేం కొత్త విషయం కాదు.మన రైతులు పూర్వం సంప్రదాయకంగా చేస్తున్న పనిని ,వారిని దారి మళ్ళించి నాశనం చేసి తిరిగి అదే పద్దతి లోకి వచ్చి ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.బహుళ జాతి సంస్థల విష కౌగిలి నుండి రైతులను కాపాడడానికి ప్రభుత్వాలు రైతు పక్షపాతిగా పని చేయాలి.
         

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

సామాన్య ప్రజల కనీస అవసరాలు ఎందుకు తీరడం లేదు?

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులైనా ప్రజల కనీస అవసరాలు తీరడం లేదు.దీనికి ప్రధాన కారణం ,మనలను పాలించే ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలతో మమేకం కాకపోవడమే.
ఇందుకు ప్రధాన కారణం ,ప్రజా ప్రతినిధులకు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు కావలసినన్ని నీళ్ళు ,కావలసినంత కరెంటు,కావలసినంత గ్యాసు,కావలసినన్ని టెలిఫోన్ కాల్స్ ,అనారోగ్యం వచ్చినప్పుడు కార్పోరేట్ ఆసుపత్రులు మరియు వాళ్ళు రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిలిపివేయడమూ జరుగుతుంటాయి.చివరికి అంబులెన్స్ కు దారిని క్లియర్ చేయకున్నా వీళ్ళకు చేస్తారు.వాళ్ళు ఏమీ ఇబ్బంది లేకుండా .సి. రూములల్లో ఉంటారు.వాళ్లకు సామాన్య ప్రజల ఇబ్బందులు ఎలా అర్థమవుతాయి.అందుకే సామాన్య ప్రజల ఇబ్బందులు అలాగే ఉన్నాయి.ప్రజాప్రతినిధులు కూడా సామాన్యుని లాగే అన్ని సమస్యలు ఎదుర్కుంటే వాటి పరిష్కారానికి మనసు పెట్టి ప్రజాసేవకులు అనిపించుకుంటారు .లేకుంటే సామాన్య ప్రజల నెత్తిమీద వాళ్ళు పెనుభారం తప్ప ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు.